హైదరాబాద్: మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు రాసిన “ఉనిక చెన్నమనేని స్వీయ చరిత్ర” పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్లో జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆర్ఎస్ఎస్ నుంచి గవర్నర్ వరకు తన అనుభవాలతో పుస్తకం ఉందని విద్యాసాగర్ రావు వివరించారు. పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పని చేయాలని రాజకీయ పార్టీల నాయకులను ఈ సందర్భంగా ఆయన కోరారు. తాను గవర్నర్గా ఉన్నప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులు నా కోసం వేయిట్ చేశారని.. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రిసీవ్ చేసుకోవడం నా బాధ్యత అని అన్నారు. అనేక సందర్భాల్లో పాలకపక్షం, ప్రతిపక్షం ఎప్పుడు ఒక్కటిగా ఉండాలని కోరారు. “సాంస్కృతిక జాతీయ వాదం అందరిలో ఉంది.. పార్టీలు వేరు కావొచ్చు. ఎల్లంపల్లికి శ్రీపాద రావు పేరు పెట్టాలని డిమాండ్ చేసిందే బీజేపీ. వాజపేయిని ప్రధాన మంత్రి అవుతావని నెహ్రూ అన్నారు. సాంస్కృతిక జాతీయ వాదం ఉంది. ఐక్య రాజ్య సమితిలో మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత అయిన వాజ్ పేయిని పీవీ పంపించారు. పాలక పక్షానికి, ప్రతి పక్షానికి పెద్దగా డిఫరెన్స్ లేదు.. అంబేడ్కర్ ఎన్ని అవమానాలు ఎదుర్కొన్న భారత జాతిని వదిలిపెట్టలేదు..” అని మాజీ గవర్నర్ వ్యాఖ్యానించారు.
దేశం అయిదవ ఆర్థిక శక్తి గా ఎదిగినా.. ఇంకా పేదరికం ఉంది. రేవంత్ రెడ్డి తీసుకున్న స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంతో పేదరికాన్ని తగ్గించవచ్చని విద్యాసాగర్రావు అన్నారు. “హైడ్రాను అందరూ పొగుడుతున్నారు..హైదరాబాద్ నగరాన్ని సుందరంగా నిర్మించుకోవాలని ముందుకు వెళ్లడం మంచిది. మూసి నదిని ప్రక్షాళన చేయాలి.. కోనేరు రంగారావు రిపోర్ట్ను అమలు చేయాలి.. గిరిజనుల భూ హక్కులను కాపాడాలి.. ప్రజలు సీఎం చేసే కార్యక్రమాలకి సహకరిస్తారు. పాలక, ప్రతిపక్షం కొన్ని సందర్భాల్లో అయిన కలిసి పని చేయాలి. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రైవేట్ బిల్లు పెడితే అయన మద్దతు ఇచ్చారు.. పాస్ అయ్యేలా చేశారు..” అని విద్యాసాగర్రావు వెల్లడించారు.
ఈ వేదికపై మూడు రంగులు కనపడుతున్నాయని.. దీనికి కారణం సీఎం రేవంత్ రెడ్డి అని తెలిపారు. తాను రచయితను కాదు.. తనకు రచనలు రావు అని విద్యాసాగర్ రావు తెలిపారు. తాను సంవత్సరం పాటు జైల్లో ఉండి రచనలు రాశానని గుర్తుచేసుకున్నారు. తాను గవర్నర్గా ఉన్నప్పుడు ఉనికి పుస్తకం రాశానని తెలిపారు. శ్రీపాదరావు తనకు అత్యంత సన్నిహితులు అని చెప్పారు. మర్రి చెన్నారెడ్డి డైనమిక్ లీడర్ అన్నారు. తాను మర్రి చెన్నారెడ్డిని పని అడిగితే వెంటనే చేసేవారని చెప్పారు. తాను బీజేపీలో ఉన్నా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శ్రీపాదరావు పేరు పెట్టాలని కోరానని గుర్తుచేశారు.
వాజ్పాయ్ను పీవీ నరసింహారావు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు పంపారని అన్నారు. 27 శాతం ఉన్న భారత జీడీపీని బ్రిటీష్ వారు దోచుకున్నారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ బ్రిటన్లో చెప్పారన్నారు. యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ స్కూల్స్ దేశ వ్యాప్తంగా పెట్టినా ఎక్కడా అమలు కాలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి ఆలోచన బాగుందని ప్రశంసించారు. హైడ్రా మంచిదే…మూసీ పునరుజ్జీవనం హైదరాబాద్కు మంచి చేస్తుందని అన్నారు. కోనేరు రంగారావు రిపోర్టును అమలు చేయాలని అన్నారు. ఆదివాసీ భూములు వారికి చెందే విధంగా చేస్తే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెన్నామనేని విద్యాసాగర్ రావు పేర్కొన్నారు.
తెలంగాణ సమాజానికి ఆదర్శ రాజకీయ నాయకుడిగా చెన్నమనేని విద్యాసాగర్ రావు నిలిచారని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. విద్యాసాగర్ రావు మా అందరికి సాగర్ జీగా ఉంటారని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి రాజకీయం నుంచి ఉమ్మడి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా,కేంద్ర మంత్రిగా పని చేశారని తెలిపారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నర్గా విద్యాసాగర్ రావు పని చేశాారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యాసాగర్ రావు సమర్ధతను గుర్తించి అవకాశం ఇచ్చారని చెప్పారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా విద్యాసాగర్ రావుపై ఎలాంటి ఆరోపణలు లేవు అని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో సిద్ధాంత పరంగా నాడు రాజకీయాలు చేశారని చెప్పారు. రాష్ట్రంలో రెండవ తరంలో జైపాల్ రెడ్డి, విద్యా సాగర్ రావు, దత్తాత్రేయ ఉన్నారని తెలిపారు. మూడో తరంలో చెప్పుకోతగ్గ నేతలు లేరన్నారు. గోదావరి జలాల కోసం విద్యాసాగర్ రావు పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. గోదావరి జలాలు తెలంగాణకు వినియోగించుకోవాలంటే విద్యాసాగర్ రావు అనుభవం అవసరమని తెలిపారు. మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ఉన్నారు.. తుమ్మిడి హెట్టి వద్ద భూసేకరణ కోసం విద్యాసాగర్ రావు అవసరం ఉందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం విద్యాసాగర్ రావు గారి అనుభవాన్ని, సలహాలను తీసుకుంటామని చెప్పారు.
ఎలాంటి అమరికలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి విద్యాసాగర్ రావు పుస్తక ఆవిష్కరణకు రావడం మంచి పరిణామమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. విద్యాసాగర్ రావు కుటుంబంలో ఎక్కువమంది వామపక్ష భావాలతో ఉన్నవారేనని అన్నారు. పేదల పట్ల, దళితుల పట్ల విద్యా సాగర్ రావు కమిట్మెంట్తో పని చేశారని కొనియాడారు. తాను సంఘటనా మంత్రిగా కరీంనగర్ వెళ్తే విద్యాసాగర్ రావు కారులో తీసుకువెళ్లారని గుర్తుచేసుకున్నారు. విద్యా సాగర్ రావు, తనకు ఎప్పుడు భేదాభిప్రాయాలు రాలేదన్నారు. 1999 నుంచి బీజేపీ దశ మారిందని చెప్పారు. గోదావరి జలాలు తెలంగాణకు రావాలని విద్యా సాగర్ రావు పరితపించారని అన్నారు.జల్, జంగల్, జమీన్ అనే కార్యక్రమాన్ని విద్యా సాగర్ రావు చేపట్టారని గుర్తుచేసుకున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ సామాన్య కార్యకర్త.. ఆవేశ పరుడే కానీ చాలా తెలివైన వారని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.
ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిగత రాజకీయాలు నడుస్తున్నాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సిద్ధాంతాలు వేరైనా తాము వ్యక్తిగత రాజకీయాలు చేయమని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా నుంచి పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా పని చేశారని గుర్తుచేశారు. విద్యాసాగర్ రావు కేంద్రమంత్రిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పేరు తీసుకువచ్చారని అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం విద్యాసాగర్ రావు పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. రాంగిరి ఖిల్లాకు తాను అడగ్గానే రూ.10 లక్షలు ఇచ్చారని చెప్పారు. మా నాన్న శ్రీపాదరావుకు.. విద్యాసాగర్ రావు అత్యంత సన్నిహితులని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ వాదిగా ఉద్యమంలో విద్యాసాగర్ రావు తనవంతు పాత్ర పోషించారని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఒక్కరో ఇద్దరో ముగ్గురితోనో రాలేదని… విద్యాసాగర్ రావు లాంటి చాలా మంది నేతల కృషి చేస్తేనే రాష్ట్రం వచ్చిందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు.
కాగా.. ఈ వేదికపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం అంటే సీహెచ్ విద్యాసాగరరావు గుర్తుకువస్తారని బండి సంజయ్ చెప్పారు.
ఉనిక పుస్తకావిష్కరణ సభలో ఆసక్తికరణ సన్నివేశం చోటుచేసుకుంది. ఒడిస్సా గవర్నర్ కంభంపాటి హరిబాబు మాట్లాడులూ.. సభ చూస్తే పార్లమెంట్లో ఉన్నట్టు అనిపిస్తుందన్నారు. వేదిక మీద ఉన్నవారంతా ఏదో సమయంలో ఎంపీలే అని హరిబాబు అన్నారు. మంత్రి శ్రీధర్బాబు మినహా మిగతా వారంతా ఎంపీలుగా చేశారు కాబట్టి శ్రీధర్ బాబు కూడా ఎప్పుడో ఒకప్పుడు పార్లమెంట్కు వెళ్తే బాగుంటుందని హరిబాబు చెప్పారు. హరిబాబు వ్యాఖ్యలకు సీఎం రేవంత్రెడ్డి , కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. కరీంనగర్ నుంచి పార్లమెంట్కి పోటీ చేస్తావా అంటూ నవ్వుతూ శ్రీధర్బాబును ముఖ్యమంత్రి రేవంత్, బండి సంజయ్లు అడిగారు. నిత్యం రాజకీయ వేడి పుట్టించే పలు పార్టీలు నాయకులందరిని ఈ వేదిక ఒకటి చేసి నవ్వులు పూయించింది.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
