◉ మల్లాపూర్ మండలంలో పర్యటించిన ఫ్రాన్స్ టీవీ జర్నలిస్టు 
◉ కార్మికుల చెమట చుక్కలు కోట్లు కుమ్మరిస్తున్నాయి… మరణిస్తే మాత్రం పట్టించుకోవడం లేదు

ఎడారి క‌ష్టాల‌ను ఎదుర్కొంటున్న ప్రాంతంపై ఇప్పుడు అంత‌ర్జాతీయ దృష్టిప‌డుతోంది. ఉత్త‌ర తెలంగాణ‌లోని ప‌రిస్థితుల‌పై విదేశీ మీడియా దృష్టిపెట్టింది. ఖతార్ లో డ్యూటీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన సురుకంటి జగన్ కుటుంబాన్ని బుధవారం నాడు ఫ్రాన్స్ టీవీ ప్రతినిధి జెర్మేన్ బస్లే ఇంటర్వూ చేశారు. ఇంటి పరిసరాలను, గ్రామాన్ని డ్రోన్ కెమెరా ద్వారా వీడియో తీసుకున్నారు. గల్ఫ్ మృతుడి కుటుంబ సభ్యుల తెలుగు సంభాషణను ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల ఇంగ్లీష్ లోకి అనువాదం చేశారు. గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, విదేశీ జర్నలిస్టుకు మార్గదర్శకులుగా వ్యవహరించారు.

ఈనెల 20న ఖతార్ లో ప్రారంభం కానున్న ప్రపంచ ఫుట్ బాల్ (ఫిఫా వరల్డ్ కప్) సందర్బంగా… ఖతార్ లో ఫుట్ బాల్ స్టేడియాలు, సంబంధిత నిర్మాణ పనులు చేసేటప్పుడు చనిపోయిన ఆసియా దేశాల వలస కూలీల విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై అంతర్జాతీయ మీడియా దృష్టి పెట్టింది. ఖతార్ లో చనిపోయిన భారతీయ వలస కూలీల కుటుంబాల స్థితిగతులపై ఇటీవల ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఇంగ్లీష్ దిన పత్రికలో ప్రచురితమైన బ్యానర్ వార్తా కథనం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఈ వార్తా కథనంలో తెలిపిన తొమ్మిది మంది మృతుల్లో ఏడుగురు తెలంగాణలోని జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు చెందినవారే. గల్ఫ్ వలసల విశ్లేషకులు, అంతర్జాతీయ కార్మిక నిపుణుడు మంద భీంరెడ్డి, వలస కార్మికుల హక్కుల కార్యకర్త స్వదేశ్ పరికిపండ్ల ఇద్దరు కలిసి ఈ సమాచారాన్ని ఇంగ్లీష్ పత్రికకు అందించారు.

డ్రోన్ కెమెరాను ఆపరేట్ చేస్తున్న ఫ్రాన్స్ జర్నలిస్ట్ 

ఇండియన్ ఎక్స్ ప్రెస్ వార్తా కథనంపై భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ స్పందించి మృతుల కుటుంబాలకు పరిహారం అందేలా ప్రయత్నించాలని దోహా ఖతార్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులను ఆదేశించారు. టీఆర్ఎస్ కు చెందిన  చేవెళ్ల లోక్ సభ ఎంపీ డా. గడ్డం రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ కు చెందిన రాజ్య సభ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా ఖతార్ లో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ని ట్విట్టర్ ద్వారా కోరారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విషయం పరిశీలిస్తామని తెలంగాణ హోంమంత్రి  మహమూద్ అలీ చెప్పారు. ఈ విషయంపై తమ శాఖ అధ్యయనం చేస్తుందని కార్మిక శాఖ మంత్రి సి. మల్లారెడ్డి తెలిపారు.

ఈ కథనానికి స్పందించిన సిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాస రావు చిట్టాపూర్, ముత్యంపేట, డబ్బా గ్రామాల్లోని మూడు ఖతార్ మృతుల కుటుంబాలను కలిసి పరామర్శించి వారి పిల్లల చదువుల కోసం తలా రూ. 10 వేల ఆర్థిక సహాయం చేశారు. వారికి రావాల్సిన పరిహారం కోసం చేసే న్యాయ పోరాటానికి సహాయం చేస్తామని ఆయన అన్నారు.

పరిహారంలో వివక్ష చూపకూడదు 

మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడానికి… ఖతార్ ఫుట్ బాల్ స్టేడియం పని ప్రదేశంలో జరిగిన మరణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారని వలస కార్మిక నాయకులు మంద భీంరెడ్డి అన్నారు. ఖతార్ లో జరిగిన ప్రతిపని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఫుట్ బాల్ ప్రపంచ కప్ పోటీలకు సంబంధం ఉన్నది కాబట్టి ఖతార్ భూభాగంలో జరిగిన ప్రతి మరణానికి ఫిఫా వరల్డ్ కప్ కమిటీ నైతిక బాధ్యత వహించి పరిహారం ఇవ్వాలని మంద భీంరెడ్డి డిమాండ్ చేశారు. ఫుట్ బాల్ స్టేడియాలు తదితర నిర్మాణాలు, నిర్వహణ కొరకు 8 బిలియన్ డాలర్లు ఖర్చు అయింది. 17 బిలియన్ డాలర్ల లాభం చేకూరుతుందని అధికారికంగా అంచనా వేశారు.

17 బిలియన్లు అంటే 1700 కోట్ల డాలర్లు. భారత కరెన్సీలో ఒక లక్షా 40 వేల కోట్ల రూపాయలు. 

భారీ ఆదాయాన్ని సమకూర్చే ఫుట్ బాల్ ప్రాజెక్టులో ప్రాణాలు వదిలిన వలస కార్మికులను ఆదుకోవడం ఖతార్ తో సహా అంతర్జాతీయ సంస్థల కనీస ధర్మం అని గల్ఫ్ కాంగ్రెస్ చైర్మన్ సింగిరెడ్డి నరేష్ అన్నారు. గుండెపోటు, ఆత్మహత్యలు, తదితర కారణాల వలన చనిపోయిన వలస కార్మికుల మరణాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే అధిక ఉష్ణోగ్రత మరణాలు, పని ప్రదేశంలో ప్రమాద మరణాలను నివారించగలిగే వారు ఆయన అన్నారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

By admin