మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఖరారు కావ‌డంతో ఉప ఎన్నిక నెక్ట్స్ లెవ‌ల్‌కు వెళ్లిపోయింది. కాంగ్రెస్ త‌రుపున పాల్వాయి స్రవంతి బైపోల్‌లో బ‌రిలోకి దిగుతుండ‌టంతో.. ఇక‌ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఎవ‌రనే చ‌ర్చ మొద‌లైంది. కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థిగా మరోసారి మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అంటే.. అటు బీజేపీ అభ్యర్థి, ఇటు కాంగ్రెస్ అభ్యర్థి ఇద్దరూ ఖరారైయ్యారు. ఇక అసలైన అధికార పార్టీ అభ్యర్థి పేరు ఖరారు కావాల్సి ఉంది. అయితే, టీఆర్ఎస్‌లో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మునుపటి ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థిని దృష్టిలో పెట్టుకుని త‌మ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. సామాజిక‌వ‌ర్గాల‌ను ప్ర‌ధానంగా దృష్టిలో పెట్టుకుని వ్యూహం ర‌చించే కేసీఆర్.. ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్టు గులాబీ పార్టీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు.

నిజానికి నియోజకవర్గంలో లక్షా 28వేల 460 మంది బీసీ ఓటర్లు ఉండగా.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కేవలం 7690 మాత్రమే ఉన్నాయి. అయితే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెడ్డిల‌నే బ‌రిలోకి దించ‌డంతో కేసీఆర్ బీసీల వైపు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పటికే మునుగోడులో బీసీ నినాదం ఎక్కువైంది. వారి ఓట్లే కీల‌కం. దీంతో రెడ్డి వర్గం కాకుండా బడుగుబలహీన వర్గానికి చెందిన నేతకు టికెట్‌ ఇచ్చే అవకాశం కనిపిస్తోందంటున్నారు. బీసీల్లో గౌడ్ సామాజిక వ‌ర్గానికి చెందిన వారేవి అత్య‌ధిక ఓట్లు ఉన్నాయి. ఇలాంటి లెక్క‌లు చూసే కేసీఆర్ బీసీ.. అందులో గౌడ నేత‌ను ప్ర‌క‌టించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తీవ్ర చ‌ర్చ మొద‌లైంది. ఈ క్ర‌మంలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ప‌ల్లె ర‌వికుమార్ పేరు ప్ర‌ధానంగా వినిపిస్తోంది. ఉద్య‌మ నేప‌థ్యం ఉన్న ప‌ల్లె ర‌వి గ‌తంలో టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డారు. ఆయ‌న స‌తీమ‌ణి ప‌ల్లె క‌ళ్యాణి మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలోని చండూరు ఎంపీపీగా ఉన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. దీంతో ఈసారి ప‌ల్లె ర‌వికి కాంగ్రెస్ టికెట్ వ‌స్తుంద‌నే చ‌ర్చ జ‌రిగింది. అయితే టికెట్ రాక‌పోవ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో బీసీ నినాదం మ‌రింతా ఊపందుకుంది. ఈ క్ర‌మంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా బీసీ.. అందులోనూ గౌడ సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌ను బ‌రిలోకి దింపే అవ‌కాశాలు ఉన్నాయనే టాక్ మొద‌లైంది. ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు పల్లె రవితో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

ప‌ల్లె ర‌వితో పాటు, టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పుడు టీఆర్ఎస్‌లో అభ్యర్థిత్వం బీసీకి ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. రీసెంట్‌గా బూర నర్సయ్య.. ఇదే డిమాండ్‌ను వినిపించారు కూడా. టిక్కెట్‌ను బీసీకే ప్రకటించాలన్నారు. మరో నేత కర్నె ప్రభాకర్ కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆయన కూడా బీసీ వర్గానికి చెందిన వారు. కొంత మంది సీనియర్ బీసీ నేతలు ఇలా మాట్లాడటంతో.. అభ్యర్థి విషయంలో మరోసారి పరిశీలన చేయాలని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

బీసీలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందన్న సంకేతం వెళ్లేలా అభ్యర్థిని ప్రకటించనున్నార‌ని గులాబీ పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే టీఆర్ఎస్‌లో ఇప్పటి వరకు అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డే టీఆర్ఎస్ క్యాండిడేట్‌గా వినిపిస్తోంది. అయితే, ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీలోని ఓ వర్గం వ్యతిరేకిస్తుండటంతో.. అధిష్టానం కాస్త ఆచితూచి అడుగులు వేస్తోంది. మ‌రి బీసీ నినాదం నేప‌థ్యంలో కేసీఆర్ తీసుకునే నిర్ణ‌యం కీల‌కంగా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

</>

డిజిట‌ల్ మీడియా దిగ్గ‌జం
BREAKINGNEWS
www.breakingnewstv.co.in

BREAKINGNEWS TV
https://www.youtube.com/c/breakingnewsfocus/featured

BREAKINGNEWS APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin