Hyderabad (MediaBoss Network): తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. అధికార టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా తమకే ఉందంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎవరికివారే ప్రకటించుకుంటున్నాయి. తామే అధికారంలోకి వస్తామంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారే ప్రకటనలు చేసుకుంటున్నాయి. ఇక కేంద్రంలోని బీజేపీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. భారీ బహిరంగ సభ కూడా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ఉరిమే ఉత్సాహంతో ఉంది. ఏడాదిలోపు ఎన్నికలు జరుగుతాయని వినిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని నిర్ణయిస్తారు అనే విషయం హాట్ టాపిక్గా మారింది. తాజాగా ఈ టాపిక్పైనే ప్రముఖ పొలిటికల్ మేనేజ్మెంట్ సర్వీసు సంస్థ Game Chanzer .. A One చానల్ ఫ్లాట్ఫాంపై నిర్వహించిన తాజా సర్వేలో ఆసక్తిరమైన ఫలితాలు వచ్చాయి.
టీ-బీజేపీకి ఎవరు సరైన ముఖ్యమంత్రి అభ్యర్థి? అంటూ ఆన్లైన్ వేదికగా Game Chanzer సంస్థ అడిగిన ప్రశ్నకు 53 శాతం మంది హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కే ఓటేశారు. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి 21 శాతం ఓట్లు రాగా, సరిగ్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా 21 శాతమే ఓట్లు రావడం విశేషం. ఆ తర్వాత స్థానంలో 5 శాతం ఓట్లతో ఎంపీ ధర్మపురి అర్వింద్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేసి ఓడిస్తానంటూ ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ను ఎదుర్కొనే సత్తా ఈటల రాజేందర్కే ఉందని అధిక శాతం ప్రజలు నమ్ముతున్నట్టు తాజా సర్వేను బట్టి తెలుస్తోంది. ఉద్యమ సెంటిమెంట్ బలంగా ఉన్న కేసీఆర్ను ఢీ కొట్టే సత్తా ఈటలకే ఉంటుందనే మాట వినిపిస్తోంది. మరి తెలంగాణ బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధిష్టానం ఎవరిని డిసైడ్ చేస్తుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్.