విరాటపర్వం సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లు ఇలా ప్రతీ ఒక్కటీ కూడా జనాల్లో ఆసక్తిని పెంచేశాయి. సాయి పల్లవి, రానా జంట జనాలను థియేటర్లకు రప్పించేలా మారింది. ఇక వేణు ఊడుగుల రచన, దర్శకత్వ ప్రతిభ ఈపాటికే అందరికీ తెలుసు. మరోసారి తనదైన శైలిలో వేణు ఊడుగుల లోతైన, సున్నితమైన అంశాన్ని ఎంచుకుని విరాటపర్వం అనే సినిమాను తెరకెక్కించాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

90వ ద‌శకంలో ఉత్త‌ర తెలంగాణ ప్రాంతంలో జరిగిన సంఘ‌ట‌న ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కించాడు డైరెక్టర్ వేణు ఉడుగుల‌. సరళనే వెన్నెలగా మలిచి.. తన శైలిలో ఈ కథను ఎంతో స్వచ్చంగా, నిజాయితీగా చెప్పేందుకు ప్రయత్నించారు. విరాటపర్వం కథ 1990వ ప్రాంతంలో జరుగుతుంది. వెన్నెల కామ్రెడ్ అరణ్య అలియాస్ రవన్న రచనలకు ప్రభావితం అవుతుంది. ప్రేమను పెంచుకుంటుంది. అయితే దళనాయకుడైన రవన్నను పట్టుకునేందుకు పోలీసులు కూడా తీవ్రంగా గాలిస్తుంటారు. అలాంటి సమయంలోనే వెన్నెల ఎన్నో క‌ష్టాలు ప‌డి చివరకు దళంలో చేరుతుంది. అయితే ఆ సమయంలోనే దళంలో కోవర్టులున్నారని తెలుస్తుంది. చివరకు వెన్నెల మీద అనుమానం వస్తుంది. ఆ స‌మ‌యంలో వెన్నెలను ఎవ‌రు చంపేస్తారు అనేదే విరాటపర్వం కథ.

విరాటపర్వం కథలో ఎంతో మంది నటీనటులున్నారు. కానీ అందరి దృష్టి మాత్రం వెన్నెలగా నటించిన సాయి పల్లవి మీదే పడుతుంది. ఆ తరువాత రవన్నగా రానా పాత్రపై అందరికీ ఆసక్తి పెరుగుతుంది. వెన్నెల పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించేసింది. కొన్ని సీన్లలో కన్నీరు పెట్టించేస్తుంది. ఇక యాక్షన్ సీక్వెన్స్ చేసిన సమయంలో విజిల్స్ వేయిస్తుంది. అలా సాయి పల్లవి పూర్తిగా స్క్రీన్‌ను ఆక్రమించేసుకున్నట్టు అనిపిస్తుంది. రానా సైతం తన ఆహార్యంతోనే అందరినీ మెప్పిస్తాడు. రవన్న కారెక్టర్‌లో దళనాయకుడిగా ఆకట్టుకుంటాడు. రానా నటన, గంభీర్యమైన వాక్చతుర్యం పాత్రను మరింతగా ఎలివేట్ చేసింది. మిగతా పాత్రధారులైన ఈశ్వరీరావు, సాయి చంద్, రాహుల్ రామకృష్ణ, బెనర్జీ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో అవలీలగా నటించేశారు.

విరాట పర్వం యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారనే విషయం తెలిశాక.. వెన్నెల పాత్ర ఎవరో కాదు సరళ అని తెలిశాక.. నాడు జరిగిన ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. నాటి సరళ విషాద ఘట్టానికి సంబంధించిన వార్తలు మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే నక్సలైట్లే సరళను చంపేశారని అందరికీ తెలిసిందే. విరాట పర్వం కథను దర్శకుడు ఏ కోణంలో చూపిస్తాడు.. ఆ హత్యను ఎలా సమర్థిస్తాడు.. ఏవిధంగా చూపిస్తాడు..ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు.. అని నిర్ణయిస్తాడు అనే దాని మీద అందరికీ ఆసక్తి పెరిగింది.

అయితే దర్శకుడు వేణు మాత్రం ఇక్కడ ఆ సున్నితమైన అంశాన్ని ఎంతో హృద్యంగా, గుండె బరువెక్కేలా చిత్రీకరించాడు. సరైన జస్టిఫికేషన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. దళసభ్యులే అనుమానంతో కోవర్టు అని చంపినా దానికి దారి తీసిన కారణాలు, అనుమానం రావడానికి గల సంఘటనలను అద్భుతంగా పేర్చాడు. చివరకు పోలీసులు పన్నిన వలలో భాగంగానే దళ సభ్యులు అలా చేయాల్సి వచ్చిందని చెప్పకనే చెప్పేశాడు. తప్పు ఎవరిది? ఒప్పు ఎవరిది.. ఈ పాపం ఎవరిది అంటూ ఇక చివర్లో వేసిన విషాద గీతంతో తాను చెప్పదల్చుకున్నది చెప్పేశాడు.

అయితే వేణు ఊడుగుల ఈ సినిమాను అందరికీ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించేందుకు చాలా డీటైల్డ్‌గా చెప్పాలని తీసినట్టు అనిపిస్తుంది. అక్కడక్కడా సీన్లు కాస్త రిపీటెడ్‌గా అనిపించినట్టుగా, అక్కడే తిరిగినట్టు అనిపిస్తుంది. కానీ ఎక్కడా మాత్రం బోర్ కొట్టదు. సాయి పల్లవి పాత్ర బోర్ కొట్టనివ్వదు. అలా వెన్నెల పాత్రతో కథను ఎంతో ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తాడు. తన ప్రేమకు దగ్గరైనట్టుగానే అవుతుంది.. కానీ అంతలోనే దూరమవుతుంది. ప్రథమార్థం మొత్తం కూడా అలానే సాగుతుంది.

సెకండాఫ్‌లో ప్రేమకు, విప్లవానికి సంఘర్షణ ఆకట్టుకుంటుంది. ప్రేమతో వెన్నెల విప్లవంలోకి అడుగుపెడుతుంది. అక్కడి నుంచి కథ ఆసక్తికరంగా మారుతుంది. ఇక చివర్లో క్లైమాక్స్ మాత్రం అందరి హృదయాలను తడుముతుంది. దర్శకుడే రచయిత కావడంతో కథను అనుగుణంగా రాసిన మాటలు ఎన్నో గుండెలను తాకుతుంటాయి. ప్రేమ అనేది రుగ్మతా? అనే విషయంలో జరిగే సంభాషణ, చర్చ మెప్పిస్తుంది. జీవితంలో రెండే రోజులు ముఖ్యమైనవి.. మనం పుట్టిన రోజు.. మనం ఎందుకు పుట్టామో తెలుసుకున్న రోజు అనే డైలాగ్ ఎంతో గొప్పగా అనిపిస్తుంది. అలా ఈ కథలో ఎన్నో మాటలు మైండ్‌లో అలా నాటుకుపోతుంటాయి. ఇక నాటి తెలంగాణ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. పోలీసుల ఝుళుం, నక్సలైట్ల ప్రభావం ఎలా ఉండేదో చూపించాడు. అన్నల పేరిట జరిగిన హత్యాకాండాలు ఎలా ఉంటాయో దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించాడు. బూటకపు ఎన్ కౌంటర్లు, ఇన్‌ఫార్మ‌ర్ల వ్య‌వ‌స్థ ఎలా ఉంటాయో చూపించాడు.

విరాటపర్వం సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా కనిపిస్తుంది. సురేష్ బొబ్బిలి పాటలు, ఆ జానపద గేయాలు, నేపథ్య సంగీతం అన్నీ కూడా మనసును తాకేలా ఉన్నాయి. రానా పాత్రకు సురేష్ బొబ్బిలి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఇక కెమెరాపనితనం అబ్బురపరుస్తుంది. సహజమైన లొకేషన్లలో తెరకెక్కించడం, అంతే సహజంగా చిత్రీకరించడంతో ఆ ఫీల్ తెరమీద కనిపిస్తుంది. ఎడిటింగ్, సినిమా నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. మొత్తానికి దర్శకుడు తాను చెప్పినట్టుగానే.. ఓ నిజాయితీ గల కథను.. అంతే నిజాయితీగా తెరకెక్కించాడు. స్వచ్చమైన ప్రేమ కథను.. అంతే స్వచ్చంగా తెరకెక్కించాడు.

రేటింగ్  3.5 / 5

By admin