– తెలంగాణ యూనియన్ కు అంతర్జాతీయ గుర్తింపు..
– తెలంగాణ యూనియన్ కు గ్లోబల్ సభ్యత్వం..
– 127 దేశాల సరసన జగిత్యాల జిల్లాకు దక్కిన అరుదైన గౌరవం..

హైదరాబాద్, (MediaBoss Network): 
స్విట్జర్లాండ్ రాజధాని జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బిడబ్ల్యుఐ) అనే గ్లోబల్ యూనియన్ ఫెడరేషన్ లో జగిత్యాలకు చెందిన ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ కు సభ్యత్వం లభించింది. 127 దేశాలలో 351 ట్రేడ్ యూనియన్‌ లతో ఒక కోటి 20 లక్షల సభ్యులకు బిడబ్ల్యుఐ ప్రాతినిధ్యం వహిస్తున్నది. భారత్, పనామా, మలేషియా, దక్షిణాఫ్రికా, బుర్కినా ఫాసో, చిలీ, కెన్యా, రష్యా, పెరూ, బ్రెజిల్‌ లలో ప్రాంతీయ కార్యాలయాలు కలిగి ఉన్నది.

జెనీవాలో ఇటీవల జరిగిన బిడబ్ల్యుఐ వరల్డ్ బోర్డు మీటింగ్ లో ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ సభ్యత్వ దరఖాస్తుకు ఆమోదం లభించింది. ఈ విషయాన్ని ఢిల్లీ కేంద్రంగా పనిచేసే బిడబ్ల్యుఐ ఆసియా పసిఫిక్ ప్రాంత ప్రతినిధి అపోలినార్ టొలెంటినో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయిండ్ల రాజిరెడ్డికి ఒక లేఖ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల మాట్లాడుతూ.. ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్, 1926 ప్రకారం తమ సంఘాన్ని రిజిస్టర్ చేశామని అన్నారు. సంఘ కార్యకలాపాలలో వెన్నంటి ప్రోత్సహించిన ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, అంతర్జాతీయ కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి, మాజీ దౌత్యవేత్త, రిటైర్డ్ ఐ.ఎఫ్.ఎస్. అధికారి అంబాసిడర్ బి.ఎం. వినోద్ కుమార్, గల్ఫ్ జెఏసి రాష్ట్ర అధ్య‌క్షులు గుగ్గిల్ల రవిగౌడ్, సంఘ సభ్యులందరికీ స్వదేశ్ కృతఙ్ఞతలు తెలిపారు. స్వరాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులు, విదేశాలలోని గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం పోరాడినందుకు తమ కు అరుదైన గౌరవం దక్కిందని ఆయన అన్నారు.

By admin