హైదరాబాద్ : సినీ నటుడు, ‘మనం సైతం'(Manam Saitham) ఫౌండేషన్ నిర్వాహకులు కాదంబరి కిరణ్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్‌తో పోరాడుతున్న సినీ సౌండ్ ఇంజనీర్ ఈమని శ్రీనివాస్ రావుకి ‘‘మనం సైతం’ నుంచి ఆర్థిక సాయం చేశారు. కిడ్నీ మార్పిడి కోసం తమవంతుగా రూ. 25,000 అందించారు. ఈమని శ్రీనివాస్ రావుకి కిడ్నీ ఫెయిల్ అయ్యి తీవ్రమైన అనారోగ్య పరిస్థితులలో నేపథ్యంలో ఆయన భార్య ఈమని శ్రీదేవి వైద్య సాయం కోసం ‘మనం సైతం’ నిర్వాహకులను అభ్యర్థించారు. దీంతో ఈమని శ్రీనివాస్ రావు పరిస్థితిని చూసి చలించిపోయిన కాదంబరి కిరణ్ సాయం అందించారు. ఆపద కాలంలో ఆర్థిక సాయం చేసిన ‘మనం సైతం’ నిర్వాహకులు కాదంబరి కిరణ్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

‘మనం సైతం’ ఫౌండేషన్ నుంచి కాదంబరి కిరణ్ నిరంతరం సేవ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. సినీ రైటర్ భరత్ కుమార్ పక్షపాతం, హృద్రోగంతో తీవ్ర అనారోగ్యానికి గురికాగా వైద్య అవసరాలకై మనంసైతం కుటుంబం నుంచి రూ.25,000 సాయం అందించి మానవత్వం చాటుకున్నారు.

సూర్యాపేటకు చెందిన రిపోర్టర్ వై. రవి కుమార్ తల్లి తారమ్మ కిడ్నీస్ దెబ్బతిన్నాయి. వారి తండ్రికి కాళ్ళు ఇన్ఫెక్షన్ తో ఇబ్బందులు పడుతున్నారు. వారి మందుల కోసం “మనంసైతం” కుటుంబం నుంచి రూ.25,000 సాయం చేశారు. ఇదే క్రమంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాకాటి నరసింహస్వామి, ఉదయ్ భాగవతుల, ఎంవీవైఎస్ రవికుమార్, విజయ్ జమ్మి కృష్ణయ్య, రజనీకాంత్ తడినాడ.. వంటి వారికి ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకున్నారు కాదంబరి కిరణ్.

పదేళ్లుగా మనం సైతం ఫౌండేషన్ ద్వారా కాదంబరి కిరణ్ పలు స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయం కోసం ఎప్పుడైనా, ఎవరికైనా, ఎక్కడైనా.. మనం సైతం సిద్ధంగా ఉంటుందని కాదంబరి కిరణ్ చెప్పారు.

 

 

 

By admin