– మంద భీంరెడ్డి

గల్ఫ్ తో పాటు ఇతర దేశాలలో ఉన్న భారతీయులు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. అసలే విదేశీ వ్యవహారం… సుదూర తీరంలో సమస్య. మనం ఇక్కడ… సమస్య ఎక్కడో…  సమస్యలను ఒక సామాన్య పౌరుడు నేరుగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసికెళ్ళే పరిస్థితి లేదు, చైతన్యం లేదు. ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయుల కష్టాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం 21 ఫిబ్రవరి 2015 న ‘మదద్’ వెబ్ సైట్ తో శ్రీకారం చుట్టింది. ఇది ప్రవాసి కార్మికులకు, కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయాలకు ఒక వారధిగా ఉపయోగపడుతుంది.

ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తున్న సాంప్రదాయ పద్ధతి ప్రకారం దరఖాస్తులు సంబంధిత అధికారులకు చేరడానికి, ఉత్తర ప్రత్యుత్తరాలకు ఎంతో సమయం పడుతుంది. ఈ స్పీడ్ యుగంలో తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి, వేగంగా పరిష్కారం పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్ పద్ధతిని ప్రవేశపెట్టింది.

భారతీయులు ఎక్కువగా వాడే పదం ‘మదద్’…  అంటే ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం అని అర్థము. ఇంచు మించు అన్ని భాషల సారాంశం కూడా అదే. ఈ విశిష్టమైన అర్థం కలిగిన ‘మదద్’ పేరుతో విదేశాల్లోని భారతీయులకు సహాయం అందించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం – విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ప్రవాసి భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా  21 ఫిబ్రవరి 2015 న ఒక వెబ్ సైట్ ను ప్రారంభించాయి.

హిందీ, ఉర్దూ, అరబిక్ భాషలలో వాడుకలో ఉన్న ‘మదద్’ అనే పదానికి తెలుగులో మద్దతు, అండ, బాసట, తోడ్పాటు, సహాయం, సాయం అనే సమానార్థాలు ఉన్నాయి. ఇంగ్లీష్ లో Help (హెల్ప్), Aid (ఎయిడ్), Assistance (అసిస్టెన్స్), Support (సపోర్ట్) అనే అర్థాలున్నాయి.

ఏయే సేవల గురించి విజ్ఞప్తులు చేసుకోవచ్చు

‘మదద్’ ద్వారా విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు అందించే దౌత్య సంబంధమైన సేవలు పొందడానికి, ఫిర్యాదులు, విజ్ఞప్తులు నమోదు చేసుకోవచ్చు. శరణార్థులు (అసైలం), జన్మ ధృవీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్), పరిహారం (కాంపెన్సేషన్), ఉద్యోగ ఒప్పంద సమస్య ( కాంట్రాక్టు ప్రాబ్లం), కోర్టు కేసు, ఇంటి పనివారలు (డొమెస్టిక్ హెల్ప్), విదేశంలో జైలు పాలైనప్పుడు (ఇంప్రిజండ్ అబ్రాడ్), వివాహ సంబంధ వివాదాలు (మారిటల్ డిస్పూట్), మృతదేహాలను స్వదేశానికి రవాణా చేయడం (మోర్టల్ రిమేన్స్), నోరి (NORI – నో ఆబ్లిగేషన్ టు రిటర్న్ టు ఇండియా), రిక్రూటింగ్ ఏజెంట్లు, స్వదేశానికి వాపస్ పంపడం (రిపాట్రియేషన్), వేతన బకాయిలు (శాలరీ డ్యూస్), యజమానితో సమస్యలు (స్పాన్సర్ ప్రాబ్లం), తప్పిపోయిన / జాడ తెలియని వారి ఆచూకీ తెలుసుకోవడం (వేర్ అబౌట్ అన్నోన్), కార్మికులను ఇబ్బంది పెట్టడం (వర్కర్ అబ్యూస్) మరియు ఇంకా ఏమైనా ఇతర సమస్యలుంటే ‘అదర్స్’ కేటగిరీ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో కేవలం విదేశాలలోని భారత రాయబార కార్యాలయాలు అందించే దౌత్య సేవల గురించి మాత్రమే ఫిర్యాదు చేయవచ్చు.

వీసా, పాస్ పోర్ట్, ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ (అవుట్ పాస్), డాక్యుమెంట్స్ అటెస్టేషన్ లాంటి సేవలకు ‘మదద్’ ద్వారా కాకుండా ఇండియన్ ఎంబసీలను నేరుగా సంప్రదించాలి. విద్య గురించి, రిక్రూటింగ్ సమస్యల గురించి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్ సైటు http://www.mea.gov.in/  లేదా ఇ-మైగ్రేట్ వెబ్ సైటు  https://emigrate.gov.in/ext/ ను సంప్రదించాలి.

‘మదద్’ లో ఫిర్యాదులు, విజ్ఞప్తులు నమోదు చేయడం ఎలా?

విదేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులు లేదా వారి కుటుంబ సభ్యులు లేదా వారి మిత్రులు ‘మదద్’ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ‘మదద్’ అంటే… కాన్సులార్ సర్వీసెస్ మేనేజ్మెంట్ సిస్టం – భారత రాయబార కార్యాలయాల్లో దౌత్య సంబంధమైన సేవల పర్యవేక్షణ వ్యవస్థ.

https://org2.passportindia.gov.in/AppConsularProject/welcomeLink లేదా https://portal2.madad.gov.in/AppConsular/welcomeLink లింక్ ను క్లిక్ చేస్తే ‘మదద్’ పేజీ ఓపెన్ అవుతుంది. ముందుగా లాగిన్ ఐడి, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకొని సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. ‘అప్లికంట్ లాగిన్’ బాక్స్ లో లాగిన్ ఐడి టైప్ చేసి  ‘కంటిన్యూ’ బటన్ పై నొక్కాలి. తదుపరి వచ్చిన బాక్స్ మొదటి లైనులో పాస్ వర్డ్, రెండో లైనులో డిస్ ప్లే అయిన క్యారెక్టర్లను టైపు చేసి ‘లాగిన్’ బటన్ పై నొక్కాలి.

‘రిజిస్టర్ గ్రీవెన్స్’ పేజీలో విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తి వివరాలు నమోదు చేయాలి. పేరు, లింగము (జెండర్), పుట్టిన తేదీ, పాస్ పోర్ట్ నెంబరు, ప్రస్తుత అడ్రస్, మిషన్ / పోస్ట్ (భారత రాయబార కార్యాలయం), ఇ-మెయిల్ ఐడి, క్యాటగిరి (ఫిర్యాదు వర్గీకరణ), డిస్క్రిప్షన్ (3 వేల పదాలకు మించకుండా సమస్య వివరాలు) తప్పకుండా నమోదు చేయాలి. ఆధార్ కార్డు, రిక్రూటింగ్ ఏజెంట్ వివరాలు, ఫోన్, మొబైల్ నెంబర్ల వివరాలు కూడా నమోదు చేయవచ్చు, కానీ తప్పనిసరి కాదు. బాధితుల తరపున వారి కుటుంబ సభ్యులు, మిత్రులు ఫిర్యాదు నమోదు చేసిన సందర్భంలో వారి వివరాలు కూడా నమోదు చేయడం తప్పనిసరి. పాస్ పోర్ట్, డాక్యుమెంట్లు స్కాన్ చేసి ఒక ఎంబి సైజుకు మించకుండా పిడిఎఫ్ ఫార్మాట్ లో అప్ లోడ్ చేయవచ్చు.

ఫిర్యాదు చేసిన వెంటనే ఒక ఒక ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తారు. ఫిర్యాదుపై ఎంబసీలు తీసుకున్న చర్యల గురించి ఆన్ లైన్ లో సమాచారం తెలుసుకోవచ్చు. విదేశాల్లో, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో వారికి ఉపయుక్తంగా పారదర్శక పద్ధతిలో సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఆన్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది.

‘మదద్’ వ్యవస్థ పనిచేసే విధానం

ఫిర్యాదు నమోదు అయిన వెంటనే మన మొబైల్ నెంబర్ కు, ఇ-మెయిల్ ఐడి కి ఫిర్యాదు సంఖ్యను తెలుపుతూ సమాచారం వస్తుంది. ఫిర్యాదుపై అధికారులు తీసుకున్న చర్యల గురించి, స్టేటస్ (స్థితి) గురించి ఆన్ లైన్ లో ట్రాక్ చేసుకోవచ్చు.

సమస్య గురించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రవాసి భారతీయ వ్యవహారాల విభాగం, సంబంధిత భారత రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బ్రాంచి సెక్రటేరియట్ లు చెన్నై, గువాహటి, హైదరాబాద్, కొలకత లకు ఏకకాలంలో ఆన్ లైన్ లో సమాచారం వెళుతుంది. అన్ని శాఖలు సమన్వయంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తాయి. ‘మదద్’ ను ఉన్నత ప్రమాణాలతో, జవాబుదారీతనంతో, తక్షణం స్పందించే విధంగా రూపొందించారు. నిర్ణీత సమయంలో సమస్యను పరిష్కరించడానికి ఫిర్యాదును ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులుగా వర్గీకరించారు. దీనితో అధికారుల జవాబుదారీతనం మరియు బాధ్యత పెరిగింది. ఫిర్యాదుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించారు.

కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారు ‘మదద్’ ను ఎలా ఉపయోగించుకోవచ్చు?

స్వంత కంప్యూటర్, లాప్ టాప్ లేనివారు, కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారు ‘మదద్’ ను ఎలా ఉపయోగించుకోవచ్చు? విదేశాల్లో ఉన్న వలస కార్మికులు గాని, భారతదేశంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు చాలా మందికి వెబ్ సైట్ ఉపయోగించడం తెలియదు. వీరిలో కంప్యూటర్ పరిజ్ఞానం లేని వారే అధికం.

గ్రామాలు, పట్టణాలలోని ‘మీ సేవ’ కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా ‘మదద్’ సేవలు పొందడానికి జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేయాలి. నిర్వాహకులకు, ఆపరేటర్లకు తగిన శిక్షణ ఇవ్వాలి. సామర్థ్య పెంపుదల (కెపాసిటీ బిల్డింగ్) అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. అన్ని పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో కూడా తగు ఏర్పాట్లు చేయాలి. ఈ విషయానికి విస్తృత ప్రచారం కల్పించి, ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

మొబైల్ అప్లికేషన్

ఫిర్యాదుల నమోదు, పరిష్కార వ్యవస్థను అందరికీ అందుబాటులోకి తేవడానికి మరింత సులభతరం, వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక మొబైల్ యాప్ ను ప్రవేశపెట్టింది.

అన్ని భారతీయ భాషల్లో

ప్రవాసులు వారి కుటుంబ సభ్యులు సహాయం కోసం, సమాచారం కోసం 24 గంటలు పనిచేసే హెల్ప్ లైన్ (టోల్ ఫ్రీ) నెంబర్ 1800 11 3090 లేదా చార్జీలు వర్తించే నెంబర్లు +91 124 234 1002 మరియు +91 11 4050 3090 మరియు  +91 11 2307 2536 కు కాల్ చేస్తే తెలుగుతో సహా అన్ని భారతీయ భాషల్లో జవాబు దొరుకుతుంది.  http://www.owrc.in ను కూడా సందర్శించవచ్చు.

వ్యాస‌క‌ర్త‌:

– మంద భీంరెడ్డి, వలస వ్యవహారాల విశ్లేషకులు.

+91 98494 22622 mbreddy.hyd@gmail.com
        

By admin