ప్రవాసి దివస్ లో గల్ఫ్ సమస్యలు చర్చించాలి
గరీబు గల్ఫ్ కార్మికులను విస్మరించిన ప్రవాసి దివస్
ప్రవాసి దివస్ ఎజెండాలో చోటు దక్కని గల్ఫ్ అంశం

◉ ప్రవాసి బీమాలో సహజ మరణాన్ని చేర్చాలి
◉ ఎన్నారైలకు ఆన్‌లైన్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలి
◉ ప్రవాసుల పెట్టుబడులపై ఉన్న ప్రేమ.. సంక్షేమంపై లేదు
◉ హైదరాబాద్‌లో గల్ఫ్ దేశాల కాన్సులేట్ లు ఏర్పాటు చేయాలి

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్):
‘ప్రవాసి భారతీయ దివస్’ వేడుకల ఎజెండాలో గల్ఫ్ కార్మికుల అంశం లేక‌పోవ‌డంపై తెలంగాణ గల్ఫ్ జేఏసీ రౌండ్ టేబుల్ స‌మావేశం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న 17వ ‘ప్రవాసి భారతీయ దివస్’ వేడుకల ఎజెండాలో గల్ఫ్ కార్మికుల సమస్యలకు చోటు దక్కలేదని సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాస్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ గల్ఫ్ జేఏసీ శనివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ‘మజ్దూర్ ప్రవాసి దివస్’ లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రవాసి దివస్ ను సంపన్న ఎన్నారైల జాతరగా మార్చేస్తున్నారని, గరీబు గల్ఫ్ కార్మికులను విస్మరించడం సరికాదని శ్రీనివాస్ రావు అన్నారు.

గల్ఫ్ దేశాలలోని 88 లక్షల మంది భారత ప్రవాసులు పంపే విదేశీ మారక ద్రవ్యాన్ని ఉపయోగించుకుంటున్న కేంద్ర ప్రభుత్వం వారి సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి విమర్శించారు. రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ఎంపీలు ఈ విషయం లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. భారత ప్రభుత్వం గల్ఫ్ దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై చూపుతున్న శ్రద్ధ, కార్మికుల కష్టాలపై, సంక్షేమంపై చూపడం లేదు. మానవ వనరులను ఎగుమతి చేస్తూ.. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తూ మనుషులతో ఎగుమతి దిగుమతి వ్యాపారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను విస్మరించినందున.. వారి గొంతు వినిపించడానికి హైదరాబాద్ లో ప్రవాసి సంఘాల ఆధ్వర్యంలో ‘మజ్దూర్ ప్రవాసి దివస్’ ను నిర్వహిస్తున్నామని సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ గల్ఫ్ కార్మికుల జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ అన్నారు. ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా గల్ఫ్ వలసలు, గల్ఫ్ కార్మికుల సమస్యలపై ఇండోర్ లో జరుగుతున్న ప్రవాసి భారతీయ దివస్ లో ఒక ప్రత్యేక గల్ఫ్ ప్లీనరీ సెషన్ నిర్వహించాలని రవిగౌడ్ డిమాండ్ చేశారు.

గల్ఫ్ నుంచి తిరిగివచ్చిన వారి పునరావాసం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు రూపొందించాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల కోరారు. కరోనా మహమ్మారి వలన విదేశాలలో ఉద్యోగాలు కోల్పోయి వాపస్ వచ్చిన కార్మికుల జీతం బకాయిలు, ఉద్యోగ ముగింపు ప్రయోజనాలు పొందడానికి ప్రభుత్వం న్యాయ సహాయం అందించాలని, గల్ఫ్ దేశాలతో చర్చించాలని స్వదేశ్ కోరారు.

‘ప్రవాసి భారతీయ బీమా యోజన’ అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పాలసీలో సహజ మరణం కూడా కవర్ అయ్యేలా ఇన్సూరెన్స్ లోని నిబంధనలు సవరించాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి కోరారు. భారత ప్రభుత్వం దౌత్యపరంగా కృషి చేసి… యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ దేశాలను ఒప్పించి హైదరాబాద్ లో కాన్సులేట్ (దౌత్య కార్యాలయాలు) ఏర్పాటు చేయించాలని ఆయన కోరారు.

ఖతార్‌లో తమ ప్రాణాలను త్యాగం చేసిన అందరు వలస కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లించేలా ఫిఫా, ఖతార్ పై భారత ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ఎన్నారైలకు ఆన్ లైన్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని గల్ఫ్ జెఏసి కార్యదర్శి గంగుల మురళీధర్ రెడ్డి కోరారు. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 15 లక్షల మంది తెలంగాణ వలస కార్మికులు, గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన మరో 30 లక్షల మంది కార్మికుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు’ ఏర్పాటు చేసి రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ కేటాయించాలి. గల్ఫ్ దేశాలలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని సమావేశంలో పాల్గొన్న వక్తలు కోరారు.

ప్రవాసి భారతీయ దివస్ 2023 వివ‌రాలు

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

 

By admin