(న్యూజెర్సీ నుంచి స్వాతి దేవినేని):
పేద విద్యార్థుల కలలను సాకారం చేసి సమాజ అభ్యున్నతికి తోడ్పాటును అందించడమే తమ లక్ష్యసాధన అని తెలుగు పీపుల్ ఫౌండేషన్ ఆర్గనైజెషన్ నిరూపిస్తోంది. ప్రవాసుల నుంచి సేకరించిన విరాళలను భారత్లోని పేద విద్యార్థుల చదువు కోసం ఆర్థిక సాయం చేస్తోంది. న్యూజెర్సీలోని ఎడిసన్లోని జేపీ స్టీవెన్స్ హైస్కూల్లో జరిగిన 14వ వార్షికోత్సవ కార్యక్రమంలో 107,000 డాలర్లకు పైగా ఫండ్ సేకరించారు. ఈ విరాళలను పేద విద్యార్థుల చదువుకోసం వినియోగించనున్నారు.
తెలుగు పీపుల్ ఫౌండేషన్ 325 మంది విద్యార్థులకు ఆర్థిక స్కాలర్షిప్లను అందించింది. ఇప్పటికే 53 ప్రాజెక్ట్లను పూర్తి చేసింది. గడిచిన 14 సంవత్సరాలలో భారతదేశంలో 30 మిలియన్ రూపాయల కంటే ఎక్కువ పంపిణీ చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పేద విద్యార్థులకు సాయం చేస్తున్నారు.
వందలాది మంది పేద విద్యార్థుల చదువుకోసం తాము చేయుత అందించామని, మున్ముందు కూడా అందిస్తామని తెలుగు పీపుల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ కృష్ణ కొత్త తెలిపారు. తలదించుకొని చదువుకొండి, సమాజంలో రేపటి రోజున తలెత్తుకుని జీవించండి.. అంటూ ఈ సందర్భంగా ఆయన విద్యార్ధులకు హితబోధ చేశారు. తాము విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నామని కృష్ణ కొత్త తెలిపారు. తమ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడిసిన్, కంప్యూటర్ అప్లికేషన్స్లో మాస్టర్స్, చార్టర్డ్ అకౌంటెన్సీ వంటి ఉన్నత విద్యకు సహాయం చేస్తుందన్నారు. తాము ఇప్పటివరకు స్పాన్సర్ చేసిన 325 మంది విద్యార్థులలో 125 మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందినవారు, 26 మంది ఐఐటి, సెంట్రల్ యూనివర్శిటీలు లేదా ఎన్ఐటిల వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుతున్నారని తెలిపారు. అందులో 24 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ (మెడిసిన్) చదువుతున్నారని, పది మంది విద్యార్థులు చార్టర్డ్ అకౌంటెన్సీ, ఒక విద్యార్థి సివిల్ సర్వీసెస్ చదువుతున్నారని చెప్పారు. తాము ఆర్థికంగా, నైతికంగా ఇచ్చే మద్దతుతో విద్యార్థులు తమ చదువులో లక్ష్యాలు సాధిస్తున్నారని కృష్ణ వివరించారు.
ఎంసి రమ్య అతిథులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కల్చరల్ ప్రొగ్రాంలు ఎన్నారైలను అలరించాయి. ప్రసిద్ధ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, గాయకులు, కళాకారుల బృందంతో ప్రత్యక్ష సంగీత వినోద కార్యక్రమాన్ని అందించారు. మిమిక్రీ కళాకారుడు రమేష్ తన అద్భుతమైన ప్రతిభతో ప్రేక్షకులను అలరిస్తూ, అద్భుతమైన సేవ చేస్తున్న సంస్థను అభినందించారు. కొరియోగ్రాఫర్లు ప్రజ్ఞ, రిహే ప్రేక్షకులను అలరించారు. తెలుగు పీపుల్ ఫౌండేషన్ ఆర్గనైజెషన్ ద్వారా ప్రతి సంవత్సరం ఎంతో మంది పేద విద్యార్థులకు చదువుకునే అవకాశం లభిస్తుందని ఈ సందర్భంగా తెలుగు పీపుల్ ఫౌండేషన్ నిర్వహకులు తెలిపారు. ఫౌండర్ ప్రసాద్ కూనిశెట్టి, ప్రెసిడెంట్ కృష్ణ కొత్త, కన్వీనర్ అరవింద బోయపాటి, ఫండ్ రైసింగ్, ఫైనాన్స్ డైరెక్టర్ ప్రవీణ్ గుడురు, సీత కొడవటిగంటి, లక్ష్మి మోపర్తి, ఇందిరా శ్రీరామ్ దీక్షిత్, ప్రసాద్ సింహాద్రి, శృతి నండూరి, అరవింద్, శ్రీషా గోరస, నిఖిల్ అయ్యర్, ప్రణవ్, శ్రీధర్ వైద్యనాథ, కార్తీక్ రామసుబ్రమణియన్.. సహా 40 మంది స్పాన్సర్లు, వంద మంది వాలంటీర్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. దాదాపు 800 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

